గాంధీ

రాత్రి భయంకరంగా  అడవంతా పరచుకుంది. మిణుకుమిణుకు మంటున్న నక్ష్రత్రాల వెలుగులో ఎటువైపునుండి ఏ జంతువు మీద పడుతుందో , ఏ బందిపోటు మూక దాడి చేస్తుందో అనే భయంతో చిన్న చిన్న గుంపులుగా కదులుతున్నారు వారు. ప్రయాణం మొదలుపెట్టినప్పటి ఆశ, ధైర్యం సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తుంది వారిలో. ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో ఒక్కో గుంపు ఒక్కో రకంగా చర్చించుకుంటున్నారు తమంతా ఒక్కరుగా కదలితే ఎంత లాభమో తెలుసుకోకుండా!  అలా నడుస్తుండగా ఆ నిర్జణారణ్యంలో దూరంగా   దీపం వెలుగు కనిపించింది. వారిలో అలజడి. బందిపోట్లు ఎవరైనా కాపుకాస్తున్నారా? వేరే ఊరు ఏదైనా మొదలవబోతుందా?  ఎటుపోతే ఏ అనర్ధం వచ్చిపడుతుందోనని  ఎటూ తెముల్చుకోలేక తాము  ఉన్నచోటే ఉండిపోయారు . చివర్కి కొందరు యువకులు ధైర్యం చేసి విషయం కనుక్కునేందుకు వెళ్ళారు.



అదొక చిన్న కుటీరం, చుట్టూతా కంచె ఏర్పాటు చేయబడి ఉంది. నార వస్త్రాలు  కట్టుకున్న ఓ నడివయసు మనిషి కుటీరంలోంచి బయటకు వచ్చి ఎండు కట్టెలను పేర్చి మంటను చేస్తున్నాడు, రాత్రివేళలో కౄరమృగాలు కుటీరం వైపునకు రాకుండా ఉండడానికి. కాసేపు గమనించి, నమ్మకం కుదిరిన తరువాత ఆ యువకులు కుటీరం వద్దకు వెళ్లి ఆయనతో తమ పరిస్థితి  వివరించారు. వారికి ఆశ్రయం కల్పించడం కన్నా తనకు ఆనందదాయకం మరొకటి ఉండదని వారి బృందం మొత్తాన్ని స్వయంగా వెళ్లి కుటీరానికి తీసుకొని వచ్చాడు.  ఆ రాత్రికి పడుకునేందుకు ఆడవారికి, పిల్లలకు కుటీరం లోపల ఏర్పాట్లు చేశాడు.

మర్నాడు ఉదయం ఆ బృందంతో మాట్లాడుతూ తన పేరు శాంతనుడని, అమరావతి వాసినని భగవదనుగ్రహం పొందేందుకు సన్యాసం స్వీకరించి దేశసంచారం చేస్తూ ప్రస్తుతం ఈ అడవిలో  ఉంటున్నానని   వారి వివరాలు ఏమిటో ఈ కీకారణ్యం గుండా ఎందుకు ప్రయాణమౌతున్నారని అడిగాడు. బృందంలోని ఓ వ్యక్తి లేచి ఆయనకు నమస్కరించి తమ కథను వివరించాడు. "స్వామీ... మాది ఈ అడవికి ఆవల ఉండే స్వర్ణపురి గ్రామం. ధాన్యరాశులతో సిరిసంపదలతో అన్నపూర్ణగా భాసిల్లేది. కొంతకాలం క్రితం బందిపోటుల మా గ్రామం మీదకు దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు, దాచుకున్న సంపదను ధాన్యాగారాలను దోచుకున్నారు. మరొక చోట నివాసం ఏర్పచుకునేందుకు  వెడుతున్నాము. ఇప్పటికి పక్షం రోజులుగా ఈ అడవిగుండా వెడుతున్నాము. దారీతెన్నూ తెలియడము లేద "ని చెప్పాడు. వారి పరిస్థితి గ్రహించిన  శాంతనుడు ముందుగా ధైర్యవచనాలు చెప్పి  వారు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు మార్గాన్ని, అరణ్యంలో సాగేపుడు తీస్కొవలసిన జాగ్రత్తలను, యే యే ఫలాలను తీసుకోవచ్చో వాటిని ఎలా ఎంచుకొవాలో, బందిపోటుల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో,  ఎటువంటి ప్రదేశంలో కొత్త గ్రామాన్నిఎలా ఏర్పాటు చేసుకొవాలో ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తి పై జీవించడం ఎంత ఉత్తమమో విపులంగా వివరించాడు. గుంపులుగా కాక అందరూ కలసి మెలసి ఉండాలని చెప్పాడు.  వారిలో కొందరిని ఎంచి నాయకులుగా తయారయేందుకు కావాల్సిన విలువలు, లక్షణాలు చెప్పి వారందరి సంరక్షణ బాధ్యతను ఎలా నిర్వహించాలో చెప్పాడు.

శాంతనుడు   క్రొత్త ఆశలు చిగురింపజేశాడు... అడవిలో కౄరమృగాల బారినపడి మరణిస్తామేమో అనుకున్న వారిలో ధైర్యం నింపాడు. శాంతనుడికి కృతజ్ఞత తెలియజేసి తమ ప్రయాణం కొనసాగించారు కొద్ది కాలానికి కొంగొత్త ’స్వర్ణపురి’ని ఏర్పాటు చేసుకున్నారు శాంతనుడు చెప్పిన మార్గంలో జీవిస్తామని నిర్ణయించుకున్నారు తమ కొత్త గ్రామంలో అతడిని దేవుడిలా కొలవసాగారు.
కాలం గడచింది, మానవ సహజమైన చపలత్వం వచ్చి చేరింది వారిలో. ఐకమత్యం కాదని ఎవరికివారు వేరని భావించడం మొదలు పెట్టారు. కొత్త మార్గాలను అన్వేషిస్తూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోవడం మొదలుపెట్టారు. శాంతనుడికి తామే నిజమైన వారసులమని తమను ప్రభువులను చేస్తే స్వర్ణపురిని నిజంగానే కనక రాశులతో నింపుతామని, వేరే గ్రామలలోని సౌభాగ్యాన్ని అందిస్తామని అద్బుతాలు సృష్టిస్తామని ప్రకటించుకున్నారు కొందరు.  ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు వారికి...భవిష్యత్తుపై చీకటి మేఘాలు కమ్ముకుంటుండగా  శాంతనుడి కోసం వేడుకుంటున్నారు ’ఓ మహాత్మా... ఓ మహర్షి మళ్ళీ రా’ అని.










*********************************

ఐదారేళ్ల క్రితం గాంధీ జయంతి/వర్ధంతి/స్వాతంత్ర్య దినోత్సవం/ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా  ’ఈనాడు’ సంపాదకీయంలో చదివిన వ్యాసానికి నా పైత్యం జోడించి రాసిన పోస్ట్ ఇది. అసలు ఆర్టికల్ రచయిత పేరు గుర్తులేదు.

**********************************

" తనకు కావలసిన నాయకత్వాన్ని సమాజమే తయారు చేసుకుంటుంది "
--- సహచర బ్లాగర్ శ్రీ బుద్దా మురళి గారు.


ఆ నాయకత్వం త్వరగా రావాలని కోరుకుంటూ...

7 వ్యాఖ్యలు.. :

Srini said...

మళ్ళీ మహాత్ముడే రావక్కర్లేదండి. ఒకవేళ వచ్చినా అలా చూస్తూ ఉండిపోవటమే తప్ప ఏమీ చేయలేరనిపిస్తుంది.

శిశిర said...

బాగుంది.

హరే కృష్ణ said...

బావుంది నాగార్జునా

..nagarjuna.. said...

@శ్రీనివాస్‌గారు: అవునండి మళ్ళీ మహాత్ముడే రానక్కరలేదు. కానీ అలాంటి లక్షణాలున్న నాయకుడు తప్పకుండా రావాల్సిందే. ఆ నాయకుడు ఎక్కడినుండైనా రావచ్చు.

@శిశిరగారు, హరే: ధన్యవాదాలు :)

నవజీవన్ said...

సజ్జనులు చెప్పే మాటల వెనుక ఏదో ఒక ఆంతర్యం ఎప్పుడూ ఉంటుంది. అది అందరు అర్ధం చేసుకోవాలి..గాంధీ, బుద్దుడు, వివేకానందుడు వీరందరి బాట లో ఇప్పటి మన భారతదేశం పయనిస్తే ఎంత బాగుణ్ణు !

..nagarjuna.. said...

మీ వ్యాఖ్యకు, మీ బ్లాగులో రావిశాస్త్రి ’అల్పజీవి’ కు పరిచయం రాసినందుకు ధన్యవాదాలు నవజీవన్ గారు.

జలతారు వెన్నెల said...

విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్ష​లు నాగార్జున గారు

Post a Comment

మీ వ్యాఖ్యలను వీలైనంతవరకు తెలుగులోనే రాయండి
తెలుగులో టైప్‌ చేయడానికి వీటిని వాడొచ్చులేఖిని, బరహ

ShareThis